: శిక్షణలో భాగంగా వారితో పాము రక్తం తాగిస్తున్నారు!

థాయ్‌లాండ్‌ బోధనా సిబ్బంది యూఎస్‌ మెరైన్‌లకు శిక్షణ ఇచ్చే క్ర‌మంలో వారితో పాము ర‌క్తం సైతం తాగిస్తున్నార‌ట‌. అక్క‌డ‌ 'జంగిల్‌ సర్వైవల్‌' పేరుతో జ‌రుగుతున్న ఈ శిక్ష‌ణ‌లో యూఎస్‌ మెరైన్‌లు కొత్త టెక్నిక్‌లను నేర్చుకుంటున్నారు. జాయింట్‌ మిలిటరీ ట్రైనింగ్‌లో భాగంగా ఈ ట్రైనింగ్ క్యాంప్ 10 రోజుల పాటు ఉంటుంది. అడ‌విలో ఏ పాము విషపూరితమైందనే అంశాన్ని కూడా తెలుసుకుంటున్నారు. సుమారు 100 యూఎస్‌ దళాలు ఈ ట్రైనింగ్‌ క్యాంపుకి హాజ‌ర‌య్యాయి. ఇందులో ప్ర‌ధానంగా ఉష్ణమండల అభయారణ్యాలలో జీవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ద‌ళాలు  అక్క‌డ‌ ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు.

మూడు నిమిషాల్లోనే మ‌నిషి ప్రాణం తీసే న‌ల్ల‌త్రాచు పాముతో ఎలా జాగ్రత్తగా వ్య‌వ‌హరించాల‌నే విష‌యాన్ని కూడా తెలియ‌జెప్పుతున్నారు. అందులో భాగంగానే కఠోరమైన సాధనలో పాము రక్తం రుచి ఎలా ఉంటుందో శిక్ష‌ణ తీసుకుంటున్న వారికి చూపించారు. నీరు దొర‌క‌ని ప‌రిస్థితుల్లో పాము రక్తం ఉపయోగపడుతోందని కూడా వారు తెలిపారు. యూఎస్‌ మెరైన్‌ల‌తో పాటు ప‌లు దేశాలకు చెందిన 29మంది మిలిటరీ అధికారులు ఈ శిక్ష‌ణ కార్యక్ర‌మంలో పాల్గొంటున్నారు.

More Telugu News