: తాము అందిస్తున్న ఫ్రీ ఆఫర్లపై ఢిల్లీ హైకోర్టులో వివరణ ఇచ్చుకున్న రిలయన్స్ జియో
ఉచితంగా అపరిమిత కాల్స్, డేటా అంటూ టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో మిగతా కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ఉచితంగా అందిస్తున్న డేటా ఆఫర్లు చట్టబద్ధమైనవి కావని ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ పిటిషన్ వేసింది. దీంతో రిలయన్స్ జియో ఢిల్లీ హైకోర్టుకు వివరణ ఇచ్చుకుంది. తాము చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని, భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా తమకు ఈ విషయంలో పూర్తి స్పష్టతనిచ్చిందని జియో తెలిపింది. ఈ పిటిషన్పై వాదనలను ఈ నెల 21న వింటామని హైకోర్టు తెలిపింది. టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రాయ్ విఫలమైందని కూడా వొడాఫోన్ ఈ పిటిషన్లో పేర్కొంది.