: భార‌త్‌లో బంగారం డిమాండ్ త‌గ్గిపోయింది: వివరాలు వెల్లడించిన డబ్ల్యూజీసీ

బంగారం అంటే ఎంతో మోజు చూపించే భార‌త్‌లో ప్ర‌స్తుతం దాని డిమాండ్ త‌గ్గిపోయింద‌ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. గ‌త ఏడాది ప‌సిడి డిమాండ్ 21 శాతం మేర పడిపోయి 675.5 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఈ డిమాండు 2015లో 857.2 టన్నులుగా ఉందని చెప్పింది. వీటికి జువెలరీ యాజ‌మాన్యాల‌ సమ్మె, పాన్ కార్డు అనుసంధానం, పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌భావం, ఆదాయ‌పు ప‌న్ను వెల్ల‌డి ప్ర‌భావాలే కార‌ణాల‌ని పేర్కొంది. అలాగే ఆభరణాల డిమాండ్ కూడా ప‌డిపోయింద‌ని గ‌త ఏడాది 514 టన్నులుగా నమోదైందని తెలిపింది. ఈ డిమాండ్ శాతం 2015 కంటే 22.4 శాతం త‌క్కువ‌ని పేర్కొంది. 2015లో ఆభరణాల డిమాండ్ 662.3 టన్నులుగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపింది.

ప్ర‌స్తుతం ఆభరణాల పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పింది. అయితే, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు గోల్డ్ ఇండస్ట్రీలో పారదర్శకతను కూడా తీసుకొస్తాయని పేర్కొంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత ఏర్ప‌డిన‌ నగదు కొరత ప్ర‌భావం గ్రామీణ ప్రాంతాన్ని అధికంగా దెబ్బతీసిందని, అయితే, ఆ ప్రభావం తాత్కాలికమేనని తెలిపింది. ఈ ఏడాది బంగారం డిమాండ్ 650-750 టన్నుల వరకు ఉంటుందని భావిస్తోంది.

More Telugu News