: మాకు వచ్చిన ఆదరణను తట్టుకోలేకనే..: ఎయిర్ టెల్ పై జియో మాటల యుద్ధం!

ఇండియాలో అత్యధికంగా మొబైల్ వినియోగదారులను కలిగివున్న ఎయిర్ టెల్, ఉచిత సేవలను ప్రారంభించి, దూసుకొచ్చిన రిలయన్స్ జియో మధ్య మరో మాటల యుద్ధానికి తెర లేచింది. తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ కనెక్టింగ్ పోర్టులను ఇవ్వడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరోసారి ఆరోపించింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో 7.24 కోట్ల మంది జియో సేవలను అందుకునేందుకు కస్టమర్లుగా మారారని, తమకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక పెద్ద టెలికం సంస్థలు కనెక్టింగ్ పోర్టులను ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించింది.

రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఇతర టెలికం సంస్థలు కేటాయించిన పీఓఎల్ (పాయింట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్)ల సంఖ్య చాలా తక్కువని పేర్కొంది. జియో నుంచి వెళ్లే ప్రతి 1000 కాల్స్ లో కేవలం 175 కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతున్నాయని పేర్కొంది. రిలయన్స్ జియో చేసిన ఆరోపణలపై ఎయిర్ టెల్ సైతం ఘాటుగా స్పందించింది. జియో కస్టమర్లలో దాదాపు 6 కోట్ల మంది ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు కాల్ చేస్తున్నారని చెబుతూ, వీరి కోసం 21,557 పీఓఐలను కేటాయించామని, వాస్తవంగా 14,164 పీఓఐలు సరిపోతాయని పేర్కొంది. పది కోట్ల మందికి సరిపడా కనెక్టింగ్ పోర్టులను ఇచ్చినా, జియో తమపై విమర్శలు చేస్తోందని ప్రత్యారోపణలు చేసింది.

More Telugu News