crime: బెంగళూరులో మరో దారుణం..బాలికలపై లైంగిక దాడి!

బెంగళూరులో మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న ఘోరాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. న్యూ ఇయ‌ర్ వేడుకల స‌మ‌యంలో అమ్మాయిల‌పై యువ‌కుల దాడి ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం పోలీసులు ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఆ న‌గ‌రంలో యువ‌తుల‌పై దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను జ‌నావాసం లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఓ వ్య‌క్తి లైంగిక దాడికి యత్నించిన ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది.

రెండు రోజుల క్రితం వయ్యాలి కావల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని స్విమ్మింగ్‌పూల్‌ లేఔట్ వ‌ద్ద మ‌ధ్యాహ్నం పూట‌ న‌డుచుకుంటూ వెళుతున్న ఓ మహిళను అడ్డుకున్న మునీశ్వరబ్లాక్‌కు చెందిన మణికంఠ అనే యువకుడు ఆమెపై లైంగికదాడికి ప్ర‌య‌త్నించాడు. అదే రోజు సాయంత్రం అదే యువ‌కుడు వయ్యాలి కావల్‌ 5వ మెయిన్‌రోడ్డులో స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న ఇద్దరు విద్యార్థినుల‌ను బలవంతంగా జ‌నావాసంలేని ప్రదేశానికి తీసుకెళ్లి  లైంగిక దాడికి ప్ర‌యత్నించాడు. స‌ద‌రు బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్నాడ‌ని, గంజాయికి అల‌వాటు ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.

More Telugu News