jayaprada: ములాయం సింగ్ యాదవ్ ఇంటికి వచ్చిన జయప్రద

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ఢిల్లీలో క‌నిపించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చెల్లదని ఫిర్యాదు చేసేందుకు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డే తన నివాసంలో ఆయ‌న పార్టీ నేల‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొన‌డానికి జ‌య‌ప్ర‌ద కూడా వ‌చ్చారు. లండ‌న్‌ ప‌ర్య‌టనలో వున్న ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరుకావడానికి హుటాహుటీన ఢిల్లీ చేరుకున్నారు.

కుటుంబ కల‌హాల‌తో కష్టాల‌ను ఎదుర్కుంటున్న ములాయంకి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో జ‌య‌ప్ర‌ద అక్క‌డ‌కు వెళ్లార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇటీవ‌లే త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపై స్పందించిన జ‌యప్ర‌ద‌ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆమె ములాయం ఇంటికి రావ‌డంతో ఆమె ములాయం సింగ్ వైపు ఉండి రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

More Telugu News