cristmas tree: శ్రీలంకలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టు

ప్ర‌పంచ వ్యాప్తంగా నిన్న క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటేలా జ‌రిగిన విష‌యం తెలిసిందే. పండుగ సందర్భంగా ప‌లుచోట్ల ఏర్పాటు చేసిన‌ క్రిస్‌మ‌స్ ట్రీలు అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ర్షించాయి. అయితే, ఈ పండుగ సంద‌ర్భంగా శ్రీలంకలోని కొలంబోలో 73 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్‌మస్‌ చెట్టును ఏర్పాటు చేశారు. ఈ చెట్టుకోసం దాదాపు 80వేల డాలర్లు ఖర్చు చేశారు. అంతేగాక ఈ చెట్టును 6 లక్షల ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించారు. దీని కోసం దాదాపు నాలుగు నెలలపాటు శ్ర‌మించార‌ట‌. ఇందులో వందలాది మంది పాలుపంచుకున్నారు. ఈ చెట్టును త‌యారు చేయ‌డం కోసం పెద్ద ఎత్తున‌ స్టీల్‌ వైర్‌ ఫ్రేమ్‌లను ఉప‌యోగించి, ప్లాస్టిక్‌ నెట్‌తో అలంకరించారు. దాదాపు ఒక మిలియన్‌ సహజ పైన్‌ కోన్స్‌ను గోల్డ్‌, సిల్వర్‌, గ్రీన్‌ రంగులద్ది అమర్చి, ఈ చెట్టుపై విద్యుద్దీపకాంతులతో ఆరుమీటర్ల నక్షత్ర ఆకారాన్ని పెట్టారు.
 
అయితే, ఈ చెట్టు కోసం వెచ్చించిన న‌గ‌దుపై ప‌లువురు విమ‌ర్శ‌లు కూడా చేశారు. ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేస్తున్నారని వారు అన్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన‌ ఆ దేశ ప్రధాని తాము ప్రైవేటు సంస్థల నుంచి వచ్చిన విరాళాల ద్వారానే ఈ చెట్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2015లో అతిపెద్ద క్రిస్‌మ‌స్ ట్రీను చైనాలో 55 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేశారు.

More Telugu News