: 1000, 1500 రూపాయలకు కు జియో ఫోన్లు?

రిలయన్స్ జియో మరో ఆఫర్ తో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. గతంలో సీడీఎంఏ, జీఎస్ఎం మొబైల్ హ్యాండ్ సెట్లతో మార్కెట్ లోకి దూసుకొచ్చి గణనీయమైన వాటాను కొల్లగొట్టిన రిలయన్స్ తాజాగా మరోసారి మొబైల్ హ్యాండ్ సెట్ బిజినెస్ పై దృష్టి పెట్టింది. ప్రధానంగా రూరల్, టైర్ 2 కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఇంకా 2జీపై ఆధారపడడంతో కేవలం 1000, 1500 రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్ ను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది. దీంతో సరికొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్ లోకి తీసుకురావాలన్న ఆలోచనలో రిలయన్స్ జియో వుంది. దీంతో ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్ లు పనిచేయనున్నాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే దీనిలో ఉండదని రిలయన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా, 2జీ టైంలో రిలయన్స్ అందుబాటులోకి తెచ్చిన ఫోన్లు ఆఫర్ల పరంగా ఆకట్టుకున్నప్పటికీ... వినియోగదారులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. దీంతో ఈసారి రిలయన్స్ తీసుకురానున్న ఫోన్లు ఆకట్టుకుంటాయా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

More Telugu News