: రూ. 10,500 కోట్ల జరిమానాపై మధ్యవర్తిత్వానికి మొగ్గుచూపిన రిలయన్స్

కృష్ణా గోదావరి చమురు క్షేత్రంలో ఓఎన్జీసీకి చెందిన చమురు బావుల నుంచి రిలయన్స్ బావులకు సహజవాయు నిక్షేపాలు వెళుతున్నాయని, దీనివల్ల ఓఎన్జీసీకి నష్టం వాటిల్లుతున్నందున 1.55 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,500 కోట్లు) జరిమానా చెల్లించాలని విధించిన జరిమానాను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పుకోవడం లేదు. ఈ తీర్పు తమకు ఎంతమాత్రమూ సమ్మతం కాదని చెబుతూ, మధ్యవర్తిత్వ విధానం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కేజీ-డీ6కు సంబంధించిన వివిధ అంశాల్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రంతో కలసి ఆర్బిట్రేషన్ కమిటీని నియమించుకోనున్నట్టు తెలిపింది. కాగా, ఈ నెల 3న రిలయన్స్ పై జరిమానా విధిస్తున్నట్టు హైడ్రోకార్బన్స్ ట్రైబ్యునల్ తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ షా నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ కేజీ బేసిన్ పై విచారించి ఆపై నివేదికను అందించగా, అందులోని వివరాలను బట్టి ఓఎన్జీసీ గ్యాస్ తో రిలయన్స్ లాభపడుతోందని తేల్చి ఈ జరిమానాను విధించారు.

More Telugu News