: ఎంతో నమ్మాను... కానీ, విశ్వాస ఘాతకుడు మిస్త్రీ: రతన్ టాటా

టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించబడ్డ సైరస్ మిస్త్రీపై రతన్ టాటా తొమ్మిది పేజీల లేఖాస్త్రాన్ని సంధిస్తూ సంచలన విమర్శలు చేశారు. మిస్త్రీని తాము ఎంతో నమ్మి పని అప్పగిస్తే, దెబ్బతీశారని, ఆయన విశ్వాస ఘాతకుడని ఆరోపించారు. ప్రధాన కంపెనీలపై పెత్తనం చెలాయించాలని చూసి, వాటిని తన అధీనంలోకి తీసుకునేందుకు యత్నించారని ఆరోపించారు. స్వతంత్ర డైరెక్టర్లను లోబరచుకుని, వారిని వాడుకున్నారని అన్నారు. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్ వాటా పడిపోయిందని, ఆయన చైర్మన్ గా ఉన్న నాలుగేళ్లలో సంస్థ రుణ భారం రూ. 69 వేల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. నష్టాన్ని అధిగమించడం ఎలాగో తెలియక, దాన్ని రైటాఫ్ లు చేయడం మొదలు పెట్టారని చెబుతూ, గతంలో మిస్త్రీ సంధించిన ప్రతి విమర్శకూ సవివరణతో కూడిన జవాబును ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లూ తమపై మిస్త్రీ బురదజల్లుతూ వచ్చారని, టాటా సన్స్ విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలం కావడం, ఇన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గడం, ఆయనకు సంస్థల నిర్వహణ చేతగాకపోవడం తదితర కారణాల వల్ల తొలగించాల్సి వచ్చిందని వెల్లడించారు. గ్రూప్ వ్యవహారాల్లో ట్రస్టులు జోక్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలను ఖండిస్తూ, ఈ విషయంలో మిస్త్రీ ప్రతి ఒక్కరినీ తప్పుదారి పట్టించాలని చూశారని అన్నారు.

More Telugu News