: ఇండియా-యూకే సీఈఓ ఫోరమ్ చీఫ్ గా సైరస్ మిస్త్రీ స్థానంలో అజయ్ పిరామల్... సీక్రెట్ గా ఉంచిన మోదీ సర్కారు!

గత నెల 24వ తేదీన టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తప్పించిన నేపథ్యంలో యూకే - ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల ఫోరమ్ నుంచి కూడా ఆయన్ను తొలగించారు. మిస్త్రీ స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ పిరామల్ ను కేంద్రం నియమించింది. యూకే, ఇండియాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం చేసేందుకు ఈ ఫోరమ్ కృషి చేస్తుంటుంది. ఇక దీనికి చీఫ్ గా సైరస్ మిస్త్రీ కొనసాగుతున్నారు. అయితే, టాటా సన్స్ నుంచి మిస్త్రీని తొలగించిన నేపథ్యంలో, సీఈఓ ఫోరమ్ కు కొత్త చీఫ్ ఎంపిక వార్తలు, కొత్త వివాదానికి, మీడియాలో చర్చకు దారితీస్తాయని భావించిన మోదీ సర్కారు ఈ నియామకాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ ప్రధాని థెరిస్సామే ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇండియా - యూకే సీఈఓల ఫోరం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అజయ్ పిరామల్ పేరును బయట పెట్టక తప్పలేదు. ఈ సీఈఓ ఫోరమ్ సమావేశం బాధ్యతలను పిరామల్ స్వయంగా పర్యవేక్షిస్తుండగా, మీడియాకు లీకులు తప్ప, అధికారికంగా ఆయన పేరును ఇంకా ప్రకటించలేదు.

More Telugu News