: 2022లో మార్స్ పైకి మానవుల తొలిబ్యాచ్ బయలుదేరుతుందట!

అంగారక గ్రహం (మార్స్)పైకి మానవుల తొలి బ్యాచ్ ను తీసుకుని తమ రాకెట్ భూమి నుంచి 2022 సంవత్సరంలో బయలుదేరుతుందని టెక్ బిలియనీర్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. మెక్సికోలో జరిగిన 67వ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ లో ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, మార్స్ పై మానవ కాలనీలు ఏర్పాటు చేయాలని, ఒక పది లక్షల మందిని అక్కడికి తీసుకువెళ్లాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అయితే, ఈ గ్రహంపైకి వెళ్లే మొదటి బ్యాచ్ వారు క్షేమంగా వెళాతారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కచ్చితంగా వెళతారని, అయితే అక్కడికి చేరుకుంటారని మాత్రం చెప్పలేమని, ప్రాణాలు పణంగా పెట్టేవారు, తమ కంపెనీ పురోభివృద్ధికి కృషి చేసే వారు ఎవరైనా ఇలాంటి సాహసం చేయవచ్చని చెప్పారు. కాగా, ఈ సమావేశంలో ఆయన చెప్పిన మరిన్ని విషయాలు.. * గ్రహాంతర రవాణా వ్యవస్థ (ఇంటర్ ప్లానెటరీ ట్రాన్స్ పోర్టు సిస్టమ్) కింద రూపొందిస్తున్న రాకెట్ల ద్వారా మార్స్ పైకి తీసుకువెళతారు * భూమి నుంచి మార్స్ పైకి చేరుకోవడానికి ప్రస్తుత అంచనా ప్రకారం పట్టే సమయం 80 రోజులు * ఈ ప్రయాణం విసుగు పుట్టకుండా ఉండేందుకు గురుత్వాకర్షణ లేని ఆటలు, ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన సంగీతం వినే ఏర్పాట్లు * మార్స్ పై కి తీసుకువెళ్లి అక్కడ నివాసం కల్పించేందుకు ఒక్కొక్కరికీ సుమారు 1000 కోట్ల డాలర్ల ఖర్చు * ఈ ఖర్చు యాభై లక్షల డాలర్లకు తగ్గించే ప్రయత్నాలు * మానవ అంతరిక్ష నౌకను తీసుకువెళ్లేందుకు పటిష్టమైన రాకెట్ రూపకల్పన * చంద్రుడిపైకి మానవులను తీసుకువెళ్లిన నాసా శాటర్న్ వీ రాకెట్ కన్నా 4 రెట్లు శక్తిమంతమైన ఇంజన్లతో ఈ రాకెట్ రూపొందించే ప్రయత్నాలు * ఈ రాకెట్ పొడవు 400 అడుగులు, వెడల్పు 39 అడుగులు

More Telugu News