: 'ఎండీవర్' ధరలను రూ. 2.80 లక్షల వరకూ తగ్గించిన ఫోర్డ్

ఎండీవర్ వేరియంట్ ఎస్యూవీ ధరలను భారీగా తగ్గిస్తున్నట్టు అమెరికన్ ఆటో మొబైల్ కంపెనీ ఫోర్డ్ వెల్లడించింది. ఓ వైపు పోటీ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్న వేళ, ఇండియాలో మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునేందుకు మార్గాలు వెతుక్కుంటున్న ఫోర్డ్, ధరల తగ్గింపును ప్రకటించింది. ఎండీవర్ కార్లపై ఏకంగా రూ.2.82 లక్షల మేర డిస్కౌంట్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. టైటానియం వేరియంట్స్ ధరలు మార్చలేదని తెలిపింది. ఫోర్డ్ ఎండీవర్ ట్రెండ్ 4/4 మాన్యువల్, ట్రెండ్ 4/2 ఆటోమేటిక్ వేరియంట్లపై డిస్కౌంట్ అధికంగా ఉంది. కాగా, గత నెలలో ఫిగో హ్యాచ్, ఆస్పైర్ సెడాన్ లపై రూ.91 వేల వరకు ధర తగ్గిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎండీవర్ మోడల్స్ పై రూ.1.72 లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఫోర్డ్ ఇప్పుడు, ఎండీవర్ ట్రెండ్ కార్లపై రూ.2.82 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ తగ్గింపు తరువాత ఎండీవర్ మోడల్స్ ధర రూ. 23.78 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

More Telugu News