: దీపావళి నుంచి అందుబాటులోకి పేటీఎం బ్యాంక్.. చిన్నపట్టణాలకూ విస్తరణ

పేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్టు బ్యాంక్ ఉపాధ్యక్షురాలు రుచితా తనజా అగర్వాల్ తెలిపారు. బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ నుంచి తుది లైసెన్సులు రావాల్సి ఉందని, అవి రాగానే బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ బ్యాంకు ద్వారా సరికొత్త వ్యాపార విధానాన్ని అవలంబిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ బ్యాంకు సాయంతో చిన్నపట్టణాలకూ పేటీఎంను విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పేటీఎంను 20 నగరాల్లోని 13.5 కోట్ల మంది వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. పేమెంట్ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఉత్పత్తులు అందించేందుకు పలు బ్యాంకులు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫిజికల్ టచ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని తనూజ వివరించారు. అలాగే పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ పొందడం వల్ల పేటీఎం వ్యాలెట్‌లోని బ్యాలెన్స్‌పై వడ్డీని చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పిన ఆమె వడ్డీ ఎంతన్న విషయాన్ని పేర్కొనలేదు. వడ్డీ కోసం పేటీఎం వ్యాలెట్ ఉన్నవారు తమ ఖాతాను ఎస్బీ ఎకౌంట్‌కు మార్చుకోవాల్సి ఉంటుందని తనూజ వివరించారు.

More Telugu News