: ఎయిర్ సెల్ విలీనం అనంతరం, మరింత బలపడేందుకు సిస్టెమాతో చర్చిస్తున్నాం: అనిల్ అంబానీ

అన్ లిస్టెడ్ టెలికం సంస్థ ఎయిర్ సెల్ ను విలీనం చేసుకున్నట్టు నిన్న ప్రకటించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ, తమ సంస్థను మరింతగా బలపరుచుకునేందుకు రష్యాకు చెందిన సిస్టెమాతో చర్చలు ప్రారంభించామని తెలిపారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఇప్పటికే ఆర్ కాంలో 10 శాతం వాటాలున్న సిస్టెమాకు 25 శాతం ఈక్విటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ 25 శాతం ఈక్విటీని అటు ఆర్ కాం, ఇటు ఎయిర్ సెల్ తమ వంతు వాటాల నుంచి చెరో సగం ఇస్తాయని తెలిపారు. భాగస్వాములు మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ తో కలసి భారత టెలికం రంగంలో మరింత స్థిరమైన వృద్ధి దిశగా సాగాలన్నదే తమ అభిమతమని అనిల్ అంబానీ తెలిపారు. ఇప్పటికే ఆదాయపరంగా, కస్టమర్ల పరంగా టాప్-4లో నిలిచిన రిలయన్స్ ను మరింత ఎత్తునకు తీసుకెళ్లడమే తమ ముందున్న కర్తవ్యమని అన్నారు. 25 శాతం ఈక్విటీని ఉపసంహరిస్తే, రూ. 6 వేల కోట్ల నిధులు చేతికందుతాయని ఆయన వివరించారు.

More Telugu News