: మళ్లీ తెరపైకి జంటగా రానున్న మాజీ ప్రేమికులు సల్మాన్, కత్రినా
మాజీ ప్రేమికులు, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ సినిమాలో జత కట్టనున్నారు. ఇటీవలే విడుదలైన 'సుల్తాన్' సినిమాతో ఆ చిత్రం హీరో సల్మాన్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు 'బార్ బార్ దేఖో' సినిమాలో ఆ సినిమా హీరోయిన్ కత్రినా చూపిన అందాలకు అభిమానులంతా ఫిదా అయిపోయారు. సల్మాన్, కత్రినా చివరిసారిగా 2012లో విడుదలయిన ‘ఏక్ థా టైగర్’లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే సినిమాకు సీక్వెల్ గానే ఇప్పుడు 'టైగర్ జిందా హై' అనే చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు స్వీకరించాడు. బక్రీద్ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త సినిమా పోస్టర్ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా ‘టైగర్ జిందా హై’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న జాఫర్.. తనకు ఓవైపు కాస్త భయంగాను, మరోవైపు ఉత్సాహంగాను ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఓ ఇండియన్ ఏజెంటు, పాకిస్థానీ గూఢచారి కలిసి ఒక శత్రువును ఎదురిస్తున్నట్లుగా సినిమా పోస్టర్ ఉంది. ఈ సినిమా 2017 క్రిస్ మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.