: కరాచీలో బక్రీద్ ప్రార్థనల్లో రెండు చోట్ల పేలుళ్లు

కరాచీలో బక్రీద్ పండగ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్థనల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో 13 మంది గాయపడ్డారు. సింథ్ ప్రావిన్స్ లోని శిఖాపూర జిల్లా ఖాన్ పూర్ ప్రాంతంలోకి గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు చొరబడ్డారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు స్థానిక మసీదుపై దాడి చేశారు. ఆ ఇద్దరిలో ఒకడు తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం మరో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఇదే జిల్లాలో జరిగిన మరో సంఘటనలో... షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు దుండగులు దాడికి విఫలయత్నం చేశారు. మసీదు ద్వారం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా, వీరిలో ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మరో దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు సంఘటనల్లో మొత్తం ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.

More Telugu News