: ఇవి ఫోటోలు కాదు... కుమార్తెకు ఓ తల్లి రాసిన క్షమాపణ పత్రాలు!

కెంట్ (బ్రిటన్) లోని డార్ట్ ఫోర్డ్ లో నివాసం ఉంటున్న భారత సంతతి మహిళ సుజాతా సేతియా (35) తన మూడేళ్ల కుమార్తెకు క్షమాపణలు చెబుతూ కొన్ని ఫోటోలు పోస్టు చేసి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తెకు ఎలా క్షమాపణలు చెప్పారంటే... 'నేనేనాడూ పిల్లల్ని కనాలని అనుకోలేదు. కానీ మూడేళ్ల క్రితం అయాత్ పుట్టినప్పుడు చాలా బాధపడ్డాను. అయితే ఆమె పుట్టుకను ఆపలేకపోవడంలో నా అసమర్థకు చింతిస్తూ, సుదీర్ఘకాలం ఒత్తిడిలోనే ఉండిపోయాను. ఈ సమయంలో ఇష్టం లేనిదానిని ప్రేమించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే... ఇంతలో కాలం తన పని తాను చేసుకుపోయింది. ఈ క్రమంలో కుటుంబంతో కలసి ఓ చిన్న ట్రిప్ కి వెళ్లాం. ఆ చిన్న ట్రిప్పే నా జీవితాన్ని, ఆలోచనని మార్చేసింది. ఇందులో చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. అందులో మొదటిదేంటంటే... నేను ప్రేమించకపోయినా నా మీద ఆధారపడటం ద్వారా నా కుమార్తె అయాత్ నా ప్రేమను పొందగలిగింది. అప్పుడు అర్థమైంది.. నేను అయాత్ ను ప్రేమించడం లేదన్నది వాస్తవం కాదు, నా కూతురంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందని! అయితే ఇన్నాళ్ల నా ఆలోచనలు భ్రమలని తేటతెల్లమయ్యాయి. ఇంతకాలం ఒక వెర్రి భ్రమలో బతికినందుకు నన్ను నేను నిందించుకున్నా. అందుకే అయాత్ కు క్షమాపణగా ఆమె బాల్యానికి సంబంధించిన అద్భుతమైన గుర్తును ఆమెకు ఇవ్వాలని భావించాను. అందులో భాగంగా కొన్ని ఫోటోలు తీశాను. ఇవి ఫోటోలు కాదు... నా కుమార్తెకు నేను రాసిన క్షమాపణ పత్రాలు' అని ఆమె పేర్కొంది. ఇది షోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

More Telugu News