: మహారాష్ట్రలో దారుణం!... దంపతులపై టోల్ గేట్ సిబ్బంది దాడి, మహిళకు వేధింపు!

మహారాష్ట్రలో ఈ నెల 7న దారుణ ఘటన చోటుచేసుకుంది. థానే నుంచి ముంబై వెళుతున్న ఓ జంటపై టోల్ గేట్ సిబ్బంది విరుచుకుపడ్డారు. తొలుత భార్యాభర్తలను తీవ్రంగా కొట్టిన సిబ్బంది... ఆ తర్వాత మహిళ గుడ్డలు చించేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. థానే జిల్లాలోని పడ్ఘా వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటైన టోల్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... వ్యక్తిగత పని నిమిత్తం ఓ జంట కారులో ముంబై బయలుదేరింది. టోల్ గేట్ వద్ద వారి కారు ఆగగా ట్యాక్స్ కట్టించుకున్న టోల్ గేట్ ఏజెంట్ బిల్లు ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేశాడు. ఇదేమని కారు డ్రైవర్ అడిగిన పాపానికి ఆ ఏజెంట్ సహా 13 మంది కారును చుట్టుముట్టి దంపతులపై దాడికి దిగారు. ఆ తర్వాత మహిళను కిందకు దించేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ దుస్తులు చిరిగిపోయినా ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న దంపతులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటిదాకా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.

More Telugu News