: ఇండియాలో రూ. 60 వేలున్న 'ఐఫోన్ 7' ధర అమెరికాలో రూ. 43 వేలకే.. దుబాయ్ లో రూ. 47 వేలు!

గత వారంలో విడుదలైన యాపిల్ ఐ ఫోన్ 7, 7 ప్లస్ వేరియంట్లకు ఇప్పుడు ముందస్తు బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ఫోన్ ధరల విషయంలో మాత్రం కస్టమర్లు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమెరికాలో అతి తక్కువగా (32 జీబీ వర్షన్) రూ. 43,400కు (649 డాలర్లు) లభిస్తున్న ఫోన్, ఇండియాలో మాత్రం రూ. 60 వేలుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ దేశాల ధరలతో పోలిస్తే, ఇండియాలోనే ధర అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. కెనడాలో రూ. 46,100 (899 కెనడా డాలర్లు)గా ఉంది. ఇక దుబాయ్ విషయానికి వస్తే రూ. 47,300కే (2,599 దినార్లు) లభిస్తోంది. జపాన్ లో రూ. 47,350 (72,800 యన్ లు), హాంకాంగ్ లో రూ. 48,200 (5,588 హాంకాంగ్ డాలర్లు), సింగపూర్ లో రూ.51,600 (1,048 సింగపూర్ డాలర్లు)కు లభిస్తోంది. ఇండియాకన్నా తక్కువ ధరకు ఐఫోన్లు పొందుతున్న దేశాల్లో యూకే, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, ఐస్ ల్యాండ్, పోర్చుగల్, ఆస్ట్రియా తదితర దేశాలెన్నో ఉన్నాయి. ఫోన్ ధరను ఇండియాలో అధికంగా ప్రకటించడాన్ని ఐఫోన్ల ప్రేమికులు విమర్శిస్తున్నారు. (ధరలన్నీ ఆయా కరెన్సీలతో శుక్రవారం నాటి రూపాయి మారకపు విలువ ప్రకారం లెక్కించినవి)

More Telugu News