: నాలో ఆవేశం, ఆవేదన కడుపు మంటతోనే వస్తాయి!: పవన్ కల్యాణ్

కడుపు మండడంతోనే సభలు, సమావేశాల్లో ఉద్వేగంగా, ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడతానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు అబద్ధాలు చెబుతుంటే... ప్రజలను మభ్యపెడుతుంటే... ప్రజలను మోసం చేస్తుంటే చూడలేక తాను ఆవేశంగా మాట్లాడుతానని ఆయన అన్నారు. తాను మాత్రమే ఆవేశపడతానని, తన కార్యకర్తలు, అభిమానులను మాత్రం సంయమనంతో వ్యవహరించమని చెబుతానని ఆయన అన్నారు. వారు కూడా తనలా ఆవేశపడితే ఎంత నష్టం జరుగుతుందో తనకు తెలుసని ఆయన తెలిపారు. దేశం మారాలని కోరుకునే కొత్త జనరేషన్ ఉందని, వారితోనే ప్రపంచం మొత్తం కలుస్తుందని, వారికి ప్రతినిధులుగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కేటీఆర్ తనను ఆంధ్రకు చెందిన వాడిగా పేర్కొనడం వల్ల వచ్చే నష్టం ఏమీలేదు కానీ, ఇలాంటి భావజాలం వల్ల దేశ సమగ్రతకు మాత్రం భంగం వాటిల్లుతుందని ఆయన అన్నారు. ఏ వ్యక్తిపైన అయినా అతను ఫలానా ప్రాంతానికి మాత్రమే చెందినవాడు, మా ప్రాంతానికి చెందినవాడు కాదు.. అంటూ ఓ ముద్ర వేయడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారని, కేవలం అధికారం కోసం ఇలాంటి రాజకీయాలు చేయడం మానేసే రోజు రావాలని, కేవలం ప్రజా సమస్యలు పరిష్కరించే రోజులు రావాలని కోరుకుంటానని ఆయన చెప్పారు.

More Telugu News