: యూపీకి తరలి వెళుతున్న ముంబై బార్ డ్యాన్సర్లు... భారీ ఎత్తున యువతుల రవాణా!

యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నేతల ప్రచారాన్ని మరింత ఆకర్షణీయం చేసి, ప్రజలను స్వచ్ఛందంగా రప్పించేందుకు ముంబైకి చెందిన బార్ డ్యాన్సర్లను భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. డ్యాన్సులు చేసేందుకు తీసుకు వచ్చిన 32 మంది అలహాబాద్ లో పోలీసులకు పట్టుబడ్డారు. ప్రచారంలో నృత్యాలు చేసేందుకే తాము వచ్చామని యువతులు చెప్పారు. వీరు ముంబై నుంచి వచ్చిన నృత్య కళాకారిణులు మాత్రమే కాదని, రాత్రి పూట నృత్యాల తరువాత వీరితో వ్యభిచారం కూడా సాగిస్తున్నారని యువతుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శ్రమిస్తున్న స్వచ్ఛంద సంస్థ 'శక్తి వాహిని' ప్రతినిధి రిషికాంత్ చెప్పారు. ఉత్తరాదిలో ఎన్నికల ప్రచారంలో అమ్మాయిలతో నృత్యాలు, ఆ తరువాత వారిని తమ అనుయాయుల వద్దకు పంపడం సర్వ సాధారణమేనని తెలుస్తోంది. అరెస్టయిన అమ్మాయిల్లో 14 ఏళ్ల వారు కూడా ఉండటం గమనార్హం. ఇప్పటికే చాలా మంది యువతులు యూపీకి చేరిపోయారని, వీరిని పుష్టిగా తయారు చేయించడం కోసం స్టెరాయిడ్లు ఇస్తున్నట్టు అనుమానాలున్నాయని బలోద్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ షేక్ వెల్లడించారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే యువతులు నృత్యాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో యూపీకి వస్తున్నారని, ఈ దారుణాన్ని అడ్డుకుని అమ్మాయిల అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

More Telugu News