: మరో విజయం.. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05 రాకెట్‌ ప్రయోగం సక్సెస్.. అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికిల్‌ (జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05) రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అందులో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌యోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి నిర్వహించారు. 2,211కిలోలు బ‌రువుగ‌ల‌ ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని 17 నిమిషాల్లోనే కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉప‌గ్రహాన్ని వాతావరణ అధ్యయనానికి ఉప‌యోగించ‌నున్నారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉప‌గ్ర‌హాన్ని రూపొందించారు. ఇస్రో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఉపగ్రహం సముద్ర గాలి దిశలను గమనించి కచ్చితత్వంతో పరిశోధనను కొన‌సాగిస్తుంది. అందులో ఇమేజింగ్‌ వ్యవస్థతో పాటు వాతావరణంలోని శబ్ద తరంగాలను అన్వేషించే వ్యవస్థ ఉంది. ఈ ఉప‌గ్ర‌హం పదేళ్ల‌పాటు సేవ‌లందించ‌నుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తాను ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి ప్రపంచానికి చాటారని అన్నారు.

More Telugu News