: తన అడుగులకు మడుగులు ఒత్తేవారే కేజ్రీవాల్ కు కావాలి!: 'ఆప్' అధినేతపై సిద్ధూ మాటల దాడి

తన అడుగులకు మడుగులు ఒత్తేవారే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కావాలని, వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని ఆయన పక్కన పెడతారని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మాటలకు 'ఎస్' అనే వారే తన పక్కన ఉండాలన్నది ఆయన అభిమతమని, తాను ఆ విధానానికి పూర్తి వ్యతిరేకినని చెప్పారు. పంజాబ్ లో వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా 'ఆవాజ్ ఇ పంజాబ్' పార్టీని స్థాపిస్తున్నట్టు తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన వ్యక్తిగత లాభాల కోసం పార్టీని పెట్టలేదని, ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశమని అన్నారు. "ఎన్నికల్లో పోటీ చేయవద్దని కేజ్రీవాల్ నాకు చెప్పారు. నా భార్యను బరిలోకి దించాలని సూచించారు. ఆమెను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. నేను బైబై చెప్పాను. ఆయనకు ఎస్ అనే వారే కావాలి" అని ఆరోపించారు. వందమంది చెడ్డవారి కంటే, ఒక మంచి వ్యక్తి ఉండటం ముఖ్యమని, అదే నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న తమకు పంజాబ్ ప్రజానీకం విజయాన్ని కట్టబెడుతుందని అన్నారు.

More Telugu News