: ‘కాంగ్రెస్’కు ఓటేస్తే క్యాన్సర్ కు ఉచిత చికిత్స చేయిస్తామంటున్న పంజాబ్ నేత

పంజాబ్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే కనుక, క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి ఉచిత వైద్యం అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. కొట్కపుర నియోజకవర్గంలో నిర్వహించిన ‘హల్కే విచ్ కెప్టెన్’ కార్యక్రమంలో భాగంగా అమరీందర్ సింగ్ ప్రజలతో మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధిన పడ్డ పేదలు చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అదేవిధంగా భటిండాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, పంజాబ్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కనుక, బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, నిరుపేదలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తో పాటు నాణ్యమైన గోధుమలు, టీపొడి, చక్కెర వంటి నిత్యావసరాలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వర్తించేలా చేస్తామని అన్నారు. సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. తాము అధికారం లోకి వస్తే విచారణ నిర్వహిస్తామని, అవినీతిపరులను శిక్షిస్తామని అన్నారు.

More Telugu News