: ఇకపై 24 గంటల్లోగానే ఎఫ్ఐఆర్ లను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి: సుప్రీంకోర్టు ఆదేశం

పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ లను సంబంధిత వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడానికి గతంలో 48 గంటల సమయం వుండేది. అయితే, ఈ సమయాన్ని ఢిల్లీ హైకోర్టు ఆమధ్య 24 గంటలకు కుదించింది. దీనిపై భారత యూత్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూనే కొన్ని సూచనలు చేసింది. ఇకపై ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ ఐఆర్ లను కచ్చితంగా 24 గంటల్లోగా ఆయా వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని ఈ మేరకు సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇంటర్ నెట్ సౌకర్యం సరిగాలేని, పరిస్థితులు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మాత్రం ఈ విషయంలో 72 గంటల గడువు ఇచ్చింది. అయితే, ఉద్రిక్తతలకు దారితీసే కేసులతో పాటు మహిళలపై లైంగిక వేధింపులు వంటి వాటికి మినహాయింపు నిచ్చింది. ఈ తరహా కేసులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

More Telugu News