: ప్రధాని నరేంద్ర మోదీ కోరికపై నాడు మౌనంగా ఉండి నేడు అడుగులేస్తున్న యాపిల్ చీఫ్ టిమ్ కుక్

"యాపిల్ సంస్థ ఐఫోన్లను ఇండియాలో తయారు చేస్తుందా? మీరు ఓ ప్లాంటు పెట్టగలరా?" ఈ సంవత్సరం ప్రారంభంలో తనను కలిసిన యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఎదురైన ప్రశ్నలివి. వీటికి సూటిగా సమాధానం చెప్పకుండానే ఆ సమయంలో టిమ్ కుక్ తన పర్యటనను ముగించుకుని వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు యాపిల్ ఐఫోన్ల అమ్మకాలు ఇండియాలో శరవేగంగా పెరుగుతున్న వేళ, ఇక్కడే ఫోన్లను తయారు చేసి కాస్తంత తక్కువ ధరకు విక్రయించగలిగితే భారీ లాభాలను వెనకేసుకోవచ్చన్న ఆలోచనతో ఉన్న కుక్, ఇండియాలో ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. తనకు అతిపెద్ద తయారీ భాగస్వామిగా ఉన్న ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ ను ఐఫోన్లను భారత్ లో తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్ లో ప్లాంటు నిర్మాణం, స్మార్ట్ ఫోన్ల తయారీ చేపట్టాలని ఆయన కోరినట్టు యాపిల్ వర్గాలు వెల్లడించాయి. "టిమ్ కుక్ ఇండియాలో ఉన్న వేళ, మేకిన్ ఇండియాలో భాగంగా ఆయన ముందు యాపిల్ ఫోన్ల తయారీ అంశం వచ్చింది. ఆ తరువాతనే మేము ఈ విషయాన్ని ఆలోచించడం ప్రారంభించాం" అని సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. కాగా, టిమ్ కుక్ భారత్ పర్యటన వేళ, బెంగళూరులో ఓ యాప్ సెంటరును, హైదరాబాద్ లో యాపిల్ మ్యాప్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News