: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి చుక్కలు చూపించిన కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా

బాలీవుడ్ చిత్రాల ప్రమోషన్ల పేరుతో నటీనటులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో ద‌ర్శ‌న‌మిస్తూ వారి అభిమానుల‌ను ఆక‌ర్షించాల‌ని చూస్తుంటారు. త‌ద్వారా సినిమా ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు. బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా న‌టించిన తాజా సినిమా 'బార్ బార్ దేఖో' ప్ర‌చారంలో భాగంగా వారు ఇటీవ‌ల ఢిల్లీ విమానాశ్రయంలో చేసిన హంగామా అక్క‌డి భ‌ద్ర‌తా సిబ్బందికి చుక్క‌లు చూపించేలా చేసింది. ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఆందోళన ఏర్ప‌డేలా ప్ర‌వ‌ర్తించి సిబ్బందికి కోపం తెప్పించారు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లే ఎయిరిండియా విమానం టికెట్లు కొని ప్ర‌యాణికుల్లా విమానాశ్ర‌యంలోకి వ‌చ్చిన కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా అక్క‌డ హ‌ల్‌చ‌ల్ చేశారు. టికెట్లను చూపించి విమానాశ్ర‌యంలోకి వ‌చ్చిన వారు.. డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లారు. ఇక అక్క‌డ త‌మ సినిమా ప్ర‌చార‌మే ల‌క్ష్యంగా నానా హంగామా చేశారు. డ్యాన్సులు చేస్తూ డైలాగులు చెబుతూ ప్ర‌యాణికుల‌ను త‌మ‌వైపుకు ఆక‌ర్షించుకున్నారు. త‌తంగం ముగిసిన అనంత‌రం విమానం ఎక్కకుండా తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన హ‌ల్‌చ‌ల్‌పై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారి మండిప‌డ్డారు. బాలీవుడ్ తార‌లు విమాన ప్రయాణం చేసే ఉద్దేశం లేకుంటే వారు విజిటర్స్ ఎంట్రీ పాస్ తీసుకొని రావాల‌ని ఆయ‌న అన్నారు. ప్రయాణికుల్లా టిక్కెట్ కొని విమానాశ్ర‌యంలోకి వ‌చ్చి తార‌లు అక్క‌డి సిబ్బందిని తప్పుదోవ పట్టించారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారిరువురూ త‌మ మూవీ ప్ర‌చారానికే వచ్చినట్టు భావిస్తున్నామ‌ని అన్నారు. సినిమా ప్ర‌చారం కార‌ణంగానే స‌ద‌రు తార‌లు ఏకంగా డ్యూటీ ఫ్రీ ఏరియాలోకి వెళ్లారని ఆయ‌న అన్నారు. ఎయిర్‌పోర్టులో తార‌లు ఎయిరిండియా విమానం వెళ్ల‌డానికి ముందే టీ3 టెర్మినల్ నుంచి బయటకు రావాల‌ని చూశారు. అయితే భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎయిర్ లైన్ ప్రోసిజర్ పూర్తయిన అనంత‌రం కత్రినా, సిద్ధార్థ్ ల‌ను బయటకు వెళ్లనిచ్చారు.

More Telugu News