: వాచ్ మన్ పై ఖాకీ కుమారుడి వీరంగం!... కలకలం రేపుతున్న సీసీ కెమెరా ఫుటేజీ!

హైదరాబాదులో ఓ ఖాకీ కుమారుడు కండకావరంతో రెచ్చిపోయాడు. పొట్టకూటి కోసం వాచ్ మన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి దిగాడు. పోలీసు అధికారి కుమారుడినన్న కండకావరంతో బరితెగించిన ఆ యువకుడు... నలుగురు కానిస్టేబుళ్లను వెంటేసుకుని వచ్చి మరీ ఈ దాడికి దిగాడు. ఈ దాడిలో వాచ్ మన్ కు తీవ్ర గాయాలు కాగా... కండ కావరంతో రెచ్చిపోయిన ఖాకీ కుమారుడు కటకటాల వెనక్కెళ్లిపోయాడు. హైదరాబాదులోని కరన్ బాగ్ లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలకు చిక్కాయి. వివరాల్లోకెళితే... కరన్ బాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మన్ గా పనిచేస్తున్న అమృత్ అనే వ్యక్తిపై రంగారెడ్డి జిల్లా పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రాజు కుమారుడు పృథ్వీరాజ్ దాడికి దిగాడు. తన తండ్రి పనిచేసే పోలీస్ స్టేషన్ లోని నలుగురు కానిస్టేబుళ్లను వెంటేసుకుని మరీ వచ్చిన పృథ్వీరాజ్... అమృత్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. దీంతో గాయాలపాలైన అమృత్ ఎలాగోలా సైదాబాదు పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడి పోలీసులకు తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైదాబాదు పోలీసులు పృథ్వీరాజ్ ను అరెస్ట్ చేశారు. ఇక కొడుకు కండ కావరాన్ని అణచివేయలేని రాజుపై సమగ్ర దర్యాప్తునకు రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News