: రైతుకు కష్టమొస్తే... నాకు నిద్ర రాదు!: సాగు ఇబ్బందులపై చంద్రబాబు కామెంట్

రాయలసీమలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు నాలుగు జిల్లాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా పంట చేతికొస్తున్న సమయంలో నీటి తడులు లేక పంట పొలంలోనే ఎండిపోతోంది. దీనిపై సమాచారం అందుకున్న చంద్రబాబు... గత వారం సీమలో అడుగుపెట్టారు. ఐదారు రోజులుగా ఆయన సీమలోనే పర్యటిస్తున్నారు. పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా జిల్లాల్లో అధికారులతో సమీక్షలు చేస్తూనే... నేనున్నానంటూ రైతులకు అభయమిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో ఓ తెలుగు ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన సాగు కష్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుకు కష్టమొస్తే తనకు అసలు నిద్రే పట్టదని ఆయన చెప్పుకొచ్చారు. రాయలసీమ రైతులకు సాగు కష్టాలు ఎదురుకాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులకు ఇబ్బందులు రాకుండా చూసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. కరవును సీమ నుంచి శాశ్వతంగా తరిమికొట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News