: జపాన్ నివేదికతో నేతాజీ మృతిపై మిస్టరీ వీడినట్లే!

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై మిస్టరీ వీడినట్లే అనిపిస్తోంది. జపాన్ నివేదిక ప్రకారం, 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ (తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బోస్ ఫైల్స్.ఇన్ అనే వెబ్ సైట్ లో పొందుపరిచారు. 1945 ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం తైపీ ఆర్మీ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ కాగానే విమానపు ఒక రెక్క తెగిపోయిందని, దీంతో విమానం అదుపుతప్పి కుప్పకూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. కూలిపోయి, మంటలు కక్కుతున్న ఆ విమానంలో నుంచి కాలిన గాయాలతో బయటపడ్డ బోస్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తైపీ ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న నేతాజీ ఆరోజు రాత్రి 7 గంటలకు చనిపోయారు. ఆగస్ట్ 22 న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో నేతాజీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నేతాజీ మరణంపై జపాన్ ప్రభుత్వం 1956లో ఒక నివేదిక తయారు చేసింది. జపనీస్, ఇంగ్లీషు భాషల్లో వరుసగా ఏడు, పది పేజీలున్న ఈ నివేదికను టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. అయితే, ఈ నివేదికను రహస్య నివేదికగా పేర్కొనడంతో భారత్, జపాన్ దేశాలు దీనిని బయటపెట్టలేదని సదరు వెబ్ సైట్ స్పష్టం చేసింది.

More Telugu News