: గత ప్రపంచకప్ టోర్నీలో రెండు విష‌యాలు న‌న్ను ఎంతో బాధించాయి: ఏబీ డివిలియర్స్

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాను రాసిన 'ఏబీ: ద ఆటోబయోగ్రఫీ' పుస్తకాన్ని ఈరోజు జోహెన్నెస్బర్గ్లో ఆవిష్కరించాడు. అందులో తాను త‌న క్రికెట్ జీవితంలో పాల్గొన్న అనేక‌ ఈవెంట్ల గురించి ప్రస్తావిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను వెల్ల‌డించాడు. గతేడాది జరిగిన క్రికెట్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో త‌న‌ను రెండు విషయాలు ఎంతో బాధ‌ప‌డేలా చేశాయ‌ని ఆయ‌న చెప్పాడు. తనను ఎంతో బాధకి గురిచేసిన అంశాల్లో తాము ఎన్నో ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తోన్న ప్ర‌పంచ క‌ప్‌ను మ‌రోసారి అందుకోలేక‌పోవ‌డం ఒకటని పేర్కొన్నాడు. ఇక రెండో విష‌యం ఏంటంటే, కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో అంత‌గా ఫామ్లో లేని ఆట‌గాడు ఫిలిండర్ని త‌మ జ‌ట్టులోకి తీసుకోవ‌డ‌మ‌ని పేర్కొన్నాడు. తాను త‌న క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పేలోపు త‌మ దేశ క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకుంటుంద‌ని పుస్తకంలోని 'ద డ్రీమ్' అనే చాప్టర్లో పేర్కొన్నాడు. గ‌త వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకతో గెలిచిన త‌మ జట్టులోని స‌భ్యుల‌నే సెమీ ఫైనల్ మ్యాచ్లో కొన‌సాగించాల‌ని తాను కోరిన‌ట్లు డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. తానొక‌టి అనుకుంటే సెలక్టర్లు మ‌రోర‌కంగా ఆలోచించి బౌలర్ కేల్ అబాట్ను స్థానంలో ఫిలిండర్ను జ‌ట్టులోకి తీసుకొచ్చార‌ని ఆయ‌న తెలిపాడు. సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు సాయంత్రం గం.5.30 ని.లకు ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు భేటీలో ఫిలిండర్ ఫిట్ నెస్ టెస్టులో స‌క్సెస్ అయ్యాడంటూ సెలక్టర్లు వ్యాఖ్యానించార‌ని ఆయన పేర్కొన్నాడు. ఆ అంశం త‌న‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేసేలా చేసింద‌ని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. ఫిలిండర్ కీలకమైన బౌలర్ అయినప్పటికీ ఈరోజు జ‌రిగిన సెమీఫైనల్ మ్యాచుకి ఆయ‌న‌ను జ‌ట్టులోకి తీసుకొని ఉండ‌కుంటే బాగుండేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News