: రాజ్ భవనా? 'రాజీ' భవనా? ఎవరి చెవుల్లో పూలు: బొత్స నిప్పులు

గవర్నర్ నరసింహన్ నివాసం రాజ్ భవన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు రాజీ కుదుర్చుకునే భవన్ గా మారుస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాజ్ భవన్ లో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని గుర్తు చేసిన ఆయన, సుజనా చౌదరి, నరసింహన్ మధ్య జరిగిన చర్చలు కేవలం ప్రత్యేక హోదాపై అని చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన, ఏసీబీ డీజీపీ, తెలంగాణ సీఎంలు స్వయంగా వెళ్లి చంద్రబాబుపై విచారణకు సంబంధించిన వివరాలను నరసింహన్ కు వివరించారని, ఆ తరువాతే సుజనా చౌదరి గవర్నర్ ను కలిశారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకునేందుకే సుజనా, గవర్నర్ ల మధ్య మాటలు నడిచాయని అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చలకయితే, కేంద్రంలో ప్రధానితో మాట్లాడాలని, హైదరాబాద్ లో గవర్నర్ తో చర్చలెందుకని బొత్స అడిగారు. హోదాపై తయారైన ముసాయిదా గురించి ముఖ్యమంత్రికి చెప్పకుండానే, గవర్నర్ కు చెప్పేందుకు సుజనా చౌదరి వెళతారని నమ్మబోమని అన్నారు. తన సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న ఘనత చంద్రబాబుదేనని ఆరోపించారు.

More Telugu News