: ముద్రగడ ఒంటరి కాదు అని చెప్పడమే మా సమావేశం లక్ష్యం: అంబటి

కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒంటరివాడు కాదు అని చెప్పడానికే దర్శకుడు దాసరి నారాయణ రావు నివాసంలో సమావేశమయ్యామని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని ముద్రగడ నెరవేర్చమంటున్నారని అన్నారు. దానిని ఆయన నెరవేర్చలేదు కనుకే ముద్రగడ పోరాడుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కాపు కీలక నేతలైన ముద్రగడతోపాటు దాసరి, చిరంజీవి, బొత్స, పల్లంరాజుతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారని ఆయన చెప్పారు. త్వరలో జిల్లా స్థాయి కాపు నేతలతో సమావేశం కానున్నామని, అనంతరం ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తున్నామని, వివరాలు త్వరలోనే ముద్రగడ ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ముద్రగడ వెంటే కాపు సమాజం ఉందని ఈ సమావేశం ద్వారా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News