: కేరళలో ఐఎస్ఐఎస్ ప్రత్యక్ష ఉగ్ర కార్యకలాపాలు... ఏకంగా ట్రైనింగ్ క్లాసులు కూడా!

కేరళలో ఐఎస్ఐఎస్ ఉగ్రపాఠాలను బోధిస్తోందని, ఉగ్రవాదులుగా ఎంపిక చేసుకున్న వారికి శిక్షణా తరగతులను కూడా ఇస్తోందన్న సంచలన విషయం ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న ఢిల్లీ నుంచి కాబూల్ మీదుగా సిరియా వెళ్లాలని బయలుదేరిన యాస్మిన్ అహ్మద్ (29) అనే స్కూల్ టీచర్ ను అరెస్ట్ చేసి విచారించిన అధికారులు పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. కేరళలో కాలుమోపిన ఉగ్రవాద సంస్థ దయేష్, 40 మంది యువతీ, యువకులను నియమించుకుని వారికి శిక్షణ ఇస్తోంది. అబ్దుల్ రషీద్ అనే రిక్రూటర్ ఉగ్రవాదుల నియామకానికి సహకరించగా, ముంబై గ్రాడ్యుయేట్ అష్ఫాక్ అబ్దుల్ మాజిద్ శిక్షణ ముగించుకుని జూన్ 2న సిరియాకు వెళ్లిపోయాడు. యాస్మిన్ వెల్లడించిన విషయాలు జాతి భద్రతకు పెను ముప్పు తెచ్చేవేనని ఎన్ఐఏ ఇన్ స్పెక్టర్ జనరల్ అలోక్ మిట్టల్ వ్యాఖ్యానించారు. దేశంలో దయేష్ ప్రాబల్యం పెరగడం ఆందోళనకరమని, ఎన్ని అరెస్టులు జరిగినా ఉగ్రవాదులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారని అన్నారు. కాగా, బీహార్ కు చెందిన యాస్మిన్ మూడేళ్ల క్రితం కేరళకు వచ్చి, మలప్పురంలోని పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచరుగా చేరింది. అక్కడే అబ్దుల్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆపై ఆమె కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైంది. చివరకు దేశం విడిచి పారిపోతూ పోలీసులకు చిక్కింది.

More Telugu News