: అమెరికా విదేశాంగ మంత్రికి చుక్కలు చూపిన ఢిల్లీ రోడ్లు!

తన భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ట్రాఫిక్ జామ్ లో గంటపాటు చిక్కుకు పోయారు. ఢిల్లీలో భారీ వర్షం పడుతుండటంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి తాజ్ మహల్ హోటల్ కు వెళుతున్న వేళ, ఆయన కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దీంతో కెర్రీతో పాటు వచ్చిన యూఎస్ జర్నలిస్టులు ఢిల్లీ రోడ్ల పరిస్థితిపై ట్వీట్ల మీద ట్వీట్లు, ఫోటోలు పెట్టడం మొదలు పెట్టేసరికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మఫ్టీలో ఉన్న పోలీసులను అప్పటికప్పుడు రంగంలోకి దించి తీన్ మూర్తి మార్గ్ ప్రాంతంలో జామ్ అయిన ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. భారీ వర్షం కారణంగా శాంతిపథ్ నుంచి తీన్ మూర్తి మార్గ్ మొత్తం నీళ్లు నిలవడంతో గంటపాటు ఎక్కడి వాహనాలక్కడ నిలిచిపోయాయి. ఇతర రహదార్లపై వాహనాలను నిలిపివేసిన అధికారులు జాన్ కెర్రీ కాన్వాయ్ కి దారిని ఇచ్చారు. కాగా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ఆయన కోసం ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకూ మొత్తం రహదారిని క్లియర్ చేశామని, కెర్రీ కాన్వాయ్ కారణంగానే ఇతర మార్గాల్లో వాహనాలు ఆగాయని ఓ అధికారి వెల్లడించారు.

More Telugu News