: మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయి... మరొకరిని చంపిన యువకుడు!

ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి మరొకరి ప్రాణం తీసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చెన్నయ్ లోని అశోక్‌ నగర్‌ లోని తమిళనాడు హౌసింగ్ బోర్డు క్వార్టర్స్‌ లోని మూడో అంతస్తులో సెల్వమ్ (34) తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. గత రాత్రి భార్యతో ఘర్షణ పడ్డాడు. వివాదం ముదరడంతో విసురుగా బయటకు వచ్చిన సెల్వమ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈ సమయంలో 70 ఏళ్ల మహిళ తన నివాసం బయట (గ్రౌండ్ ఫ్లోర్) నిద్రిస్తోంది. మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసిన సెల్వమ్ సరిగ్గా ఆమెపై పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా అరిచింది. ఇది విన్న స్థానికులు పరుగున రాగా ఇద్దరూ గాయాలతో కనిపించడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన మహిళ మృతి చెందగా, సెల్వమ్ చికిత్స పొందుతున్నాడు. సెల్వమ్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News