: రెండు నెలల్లో రూ. 10 లక్షల కోట్ల లాభం... దలాల్ స్ట్రీట్ లో లాభాల పంట పండించుకున్న సెక్టార్లివే!

ఓ రెండు నెలల క్రితం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 98 లక్షల కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉంది. ఈ రెండు నెలల వ్యవధిలో మార్కెట్ కాప్ దాదాపు రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్లో కొనసాగుతున్న బుల్ రన్ కారణంగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వివిధ సెక్టార్లలోని కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మెటల్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు, సహజవాయు రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు గడచిన 60 రోజుల వ్యవధిలో శరవేగంగా ముందుకు సాగాయి. జూన్ 27న రూ. 100 లక్షల కోట్ల మార్క్ ను బీఎస్ఈ లిస్డెడ్ కంపెనీల మార్కెట్ కాప్ తాకగా, అప్పటి నుంచి సెన్సెక్స్ 5 శాతానికి పైగా పెరిగి 1,350 పాయింట్లు లాభపడింది. మెటల్స్ ఇండెక్స్ 17 శాతం పెరుగగా, పీఎస్యూ ఇండెక్స్ 14.5 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 14 శాతం లాభపడ్డాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వాటాలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పొటీ పడ్డారని, ఈ కంపెనీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయని పెట్టుబడిదారులు నమ్ముతుండటమే ఇందుకు కారణమని ఇండీట్రేడ్ కాపిటల్ చైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ అభిప్రాయప్డారు. ఇక జూన్ 27 తరువాత తాజా సెషన్ వరకూ మిడ్ క్యాప్ 14 శాతం, ఇంధన రంగం 13 శాతం ఆటో ఇండస్ట్రీ 12 శాతం, రియాల్టీ 9 శాతం, ఎఫ్ఎంసీజీ 6 శాతం లాభాలను అందించగా, టెక్నాలజీ, ఐటీ రంగాల్లోని కంపెనీలు 2 నుంచి 5 శాతం వరకూ నష్టపోయాయని బీఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News