: పల్నాడులో మరింత హైటెన్షన్!... పిడుగురాళ్లలో యరపతినేని హౌస్ అరెస్ట్!

కృష్ణా పుష్కరాల్లో అవినీతి జరిగిందని ఒకరు, నిరూపించాలని మరొకరు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పల్నాడులో గంట గంటకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ హైటెన్షన్ వాతావరణానికి వైసీపీ నేత, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిప్పు రాజేయగా, టీడీపీ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆజ్యం పోశారు. వీరిద్దరూ పరస్పరం చేసుకున్న వ్యాఖ్యల కారణంగా ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నడికుడి మార్కెట్ యార్డులో బహిరంగ చర్చకు సిద్ధమన్న యరపతినేని సవాల్ ను స్వీకరించిన పిన్నెల్లిని నేటి ఉదయమే మాచర్లలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చేసిన సవాల్ మేరకు నడికుడి మార్కెట్ యార్డుకు బయలుదేరేందుకు సిద్ధపడ్డ యరపతినేనిని కూడా పోలీసులు కాసేపటి క్రితం పిడుగురాళ్లలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై అటు టీడీపీ శ్రేణులు, ఇటు వైసీపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. వెరసి పల్నాడులో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News