: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తాజ్‌మహల్ ప్రవేశంపై ఆంక్షలు!

ప్రపంచ ఏడో వింతల్లో ఒకటి, ప్రేమకు ప్రతిరూపమైన చారిత్రక తాజ్‌మహల్‌లోకి ప్రవేశంపై ప్రభుత్వం ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. తాజ్‌మహల్‌ను సంరక్షించే చర్యల్లో భాగంగా పర్యాటకులను లోనికి అనుమతించడంపై నిబంధనలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సందర్శన వేళలను కుదించనున్నట్టు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు పేర్కొన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) నిర్వహించిన అధ్యయనం సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పర్యాటకులు పోటెత్తుతుండడంతో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా అద్భుత కట్టడంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. కాగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2012లో 7.43 లక్షల మంది విదేశీ పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శించగా 2013లో ఆ సంఖ్య 6.95 లక్షలకు చేరుకుంది. 2014లో ఇది మరింత దిగజారింది. ఆ ఏడాది 6.48 లక్షల మంది విదేశీ పర్యాటకులు మాత్రమే తాజ్‌మహల్‌ను సందర్శించారు.

More Telugu News