: ఏపీ డిమాండ్ కు మాజీ ప్రధాని దన్ను!... ‘హోదా’ ఇవ్వాల్సిందేనన్న దేవేగౌడ!

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటున్న నవ్యాంధ్ర వాదనకు మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మద్దతు పలికారు. విజయవాడ నగరంలో ఓ జ్యువెల్లర్స్ షోరూమ్ ను ప్రారంభించేందుకు మొన్న రాత్రికే విజయవాడ చేరుకున్న ఆయన నిన్న సదరు షోరూంకు రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని గౌడ పేర్కొన్నారు. సదరు హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్నేహంగా ఉన్నారని, ఈ క్రమంలో ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఎక్కడా చెప్పలేదని కూడా గౌడ చెప్పారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటనలో కేంద్రానికి ఉన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు తప్పించి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆయన చెప్పలేదని గౌడ వ్యాఖ్యానించారు.

More Telugu News