: టోక్యో ఓలింపిక్స్ లో మరిన్ని పతకాలు!... దీపా దేశ ప్రజల హృదయాలను గెలిచిందన్న సచిన్!

రియో ఒలింపిక్స్ లో భారత మహిళా ఆథ్లెట్లు సత్తా చాటారని క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అన్నారు. రియోలో పతకాలు సాధించిన పీవీ సింధు, సాక్షి మాలిక్ లు రెండు పతకాలు సాధించగా, జిమ్నాస్టిక్స్ లో భారత సత్తాను చాటిన దీపా కర్మాకర్ మాత్రం పతకం సాధించలేకపోయింది. అయినా ఆమె ప్రతిభ పట్ల దేశం యావత్తు హర్షం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వీరు ముగ్గురితో పాటు భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు పలువురు ప్రముఖులు అందించనున్న బీఎండబ్ల్యూ కార్లను బహూకరించేందుకు సచిన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ అకాడెమీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ లో మహిళా ఆథ్లెట్లు సత్తా చాటారన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. రియోలో దీపా కర్మాకర్ పతకం సాధించలేకపోయినా... దేశ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకున్నారని సచిన్ పేర్కొన్నారు.

More Telugu News