: మీ పిల్లలు ఎవరితోనూ కలవరా?.. ఇలా చేస్తే అద్భుతాలు చేస్తారు!

పిల్లలందరి స్వభావం ఒకేలా ఉండదు. కొందరు అందరితో కలిసిపోతే మరికొందరు కొత్తవారిని చూడగానే ముడుచుకుపోతారు. ముభావంగా మారిపోతారు. స్కూల్‌లోనే కాదు.. ఇంటి దగ్గర తల్లిదండ్రులతోనూ మాట్లాడేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో పిల్లలు తమతో మాట్లాడడం లేదని తల్లిదండ్రులు ఆవేద చెందుతుంటారు. విద్యార్థులకు స్టేజ్ ఫియర్ తొలగించేందుకు స్కూళ్లలో టీచర్లు పలు కార్యక్రమాలు చేపడుతుంటారు. వివిధ అంశాలపై వారితో మాట్లాడిస్తుంటారు. అయితే పాఠశాలల్లో ఇలా చేయిస్తున్నారు కదా అని ఇంటి దగ్గర వారితో మాట్లాడకుండా ఉండడం కూడా తప్పంటున్నారు నిపుణులు. వారితో సరదాగా కాసేపు మాట్లాడడం ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంచవచ్చని చెబుతున్నారు. చిన్నారులను స్వేచ్ఛగా మాట్లాడనిస్తే వారి ఆలోచనలను సంకోచం లేకుండా పంచుకుంటారని చెబుతున్నారు. చాలామంది చిన్నారులు ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు.. అందరితోనూ ఇలాగే ఉంటారు. ఇలా ఉండడాన్ని వారి తప్పుగా భావించకూడదు. తమతో మాట్లాడకుండానే వారేం చెబుతున్నారో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అలాగే కొత్త ప్రదేశాలను, కొత్త వ్యక్తులను పరిచయం చేయాలి. వారితో పదేపదే మాట్లాడే అవకాశం ఇవ్వాలి. పిల్లలు ఎదుగుతున్నారు కదా అని ఈ విషయంలో కట్టడి చేయాల్సిన అవసరం లేదు. అలాగే హాబీలు అలవర్చుకోవడంలో, కొత్త స్నేహాలు పెంచుకోవడంతో తల్లిదండ్రులు వారికి సాయం చేయాలి. ఇతర వ్యాపకాల్లో పాలుపంచుకోవడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రయత్నించాలి. గతంలో చేసేందుకు ఇబ్బంది పడిన పనులను ఇప్పుడు చేస్తుంటే ఆ విషయాన్ని వారికి తెలియజెప్పి వారిని మరింత ఉత్సాహపరచాలి. ఇలాంటి చిన్నచిన్న ప్రయత్నాలతో వారిలోని ఇంట్రావర్ట్‌ పర్శనాలిటీని తరమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News