: నన్ను బీజేపీలోకి వచ్చేయమన్నారు.. నేనేం చెప్పానో తెలుసా?: పవన్ కల్యాణ్

న‌రేంద్ర‌ మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేముందు ఢిల్లీకి వెళ్లి ఆయ‌నతో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పాన‌ని మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఆయన వద్దకు వెళ్లలేదని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తిరుప‌తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ ‘నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను. మిమ్మ‌ల్ని మోసం చేయ‌ను. బీజేపీ అదిష్ఠానం నుంచి ఓ నేత‌ వ‌చ్చి న‌న్న‌డిగారు. జాతీయ పార్టీల‌కే భ‌విష్య‌త్తు ఉంద‌ని బీజేపీలోకి వ‌చ్చేయ‌మ‌న్నారు. నేనేం స‌మాధానం చెప్పానో తెలుసా..? తెలుసా..? నాకు బీజేపీపై గౌర‌వం ఉందని అన్నాను. తెలుగు రాష్ట్రాల‌ స‌మ‌స్య‌ల కోస‌మే జ‌న‌సేన అన్నాను. ప్రాంతీయ పార్టీ అవ్వొచ్చు కానీ జాతీ శ్రేయ‌స్సును కోరే పార్టీ. అంత‌ర్జాతీయ ప్ర‌భావం దేశంపై ఎలా ఉంటుందో కూడా దృష్టి పెట్టే పార్టీ అని చెప్పాను’ అని ప‌వ‌న్ అన్నారు. అలా బీజేపీలో కి వెళ్లాల‌నుకుంటే ఎప్పుడో వెళ్లిపోయేవాడినని, తాను బీజేపీ పార్టీని గౌర‌విస్తానని, కానీ అందులోకి మాత్రం వెళ్లను అన్నారు పవన్. ‘ఎవ‌రి జెండానో మోయ‌డానికి కాదు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మోయ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఒక‌వైపు మోదీ విదేశాలు తిరుగుతున్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. నాకు హోదాపై ఇటువంటి స‌మయంలో అడ‌గడం ఇష్టం లేదు. లేడీకి లేచిందే ప‌రుగ‌న్నట్లు వ్య‌వ‌హ‌రించ‌లేదు. ముందు చూద్దాం. వారేం చేస్తారో చూద్దాం అనుకున్నాను. కానీ రెండేళ్లు గ‌డిచిపోయాయి.. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడ‌బోయేది స్పెష‌ల్ స్టేట‌స్ కోస‌మే’ అని పవన్ అన్నారు. ‘మీకు సీమాంధ్రులంటే చుల‌క‌నా..? పౌరుషంలేని వారిమా..? బీజేపీ, కాంగ్రెస్ సీమాంధ్రులతో ఎందుకిలా ఆడుకుంటున్నాయి... సీమాంధ్రుల ప్రేమ చూశారు.. వారి స‌హ‌నం చూశారు... ఇచ్చిన మాట వెన‌క్కి తప్పితే సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటే పోరాటం ఎలా ఉంటుందో ఇకపై చూస్తారు. యూపీఏ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని విడ‌గొట్టిన‌ప్పుడు ప‌ధ్ధ‌తి లేకుండా విడ‌గొట్టింది.. ఇంత మంది యువ‌కులున్నారు. ఈ దేశానికి వెన్నుముక యువ‌త అంటారు. అలాంటి యువ‌త‌కి మ‌నం ఏం చెయ్యాలి... వారిని ఎలా ఉప‌యోగించుకోవాలి అనే ఆలోచ‌నే లేకుండా పాల‌న చేస్తున్నారు’ అని పవన్ వ్యాఖ్యానించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ విడ‌గొట్టిన‌ప్పుడు యువ‌త‌కు ఏం చెయ్యాలో చెప్ప‌లేదు. కాంగ్రెస్ ఒక్క‌టే కాదు అనుకుంటే బీజేపీ కూడా ఏం త‌క్కువ కాదు.. మీరు అడ‌గొచ్చు మ‌రెందుకు ఆనాడు స‌పోర్ట్ చేశార‌ని. దేశంలో రెండే పార్టీలున్నాయి. మరి ఏది దిక్కు? అని ఆయ‌న ప్రశ్నించారు. 'స‌ర్... ప్లీజ్ స‌ర్.. స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వండి స‌ర్' అని అడగుతున్నారు. అది సరికాదు. నేను మొద‌టి ద‌శ‌లో జిల్లాల్లో తిరుగుతాను. హోదాపై పార్టీలను ప్ర‌శ్నిస్తా. అంద‌రూ నన్ను ఎందుకు ప్రశ్నించడం లేదు? అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆలోచించి నిర్ణయం తీనుసుకుంటా. ఇప్పుడు ప్ర‌శ్నిస్తా’ అని వ్యాఖ్యానిచారు.

More Telugu News