: పంద్రాగస్టు ప్రసంగంలో బెలూచిస్థాన్ గురించి చెబుదామా? మంత్రులను సలహా అడిగిన ప్రధాని... వద్దన్న పారికర్, సరేనన్న రాజ్ నాథ్!

రెండు వారాల క్రితం కీలక మంత్రులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ, తన ఎర్రకోట ప్రసంగంలో బెలూచిస్థాన్ గురించి ప్రస్తావించాలా? వద్దా? అన్న విషయాన్ని చర్చించినట్టు 'రాయ్ టర్స్' వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బెలూచిస్థాన్ గురించి మాట్లాడితే, పాకిస్థాన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కొందరు మంత్రులు హెచ్చరించారని, అయినప్పటికీ ప్రధాని పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే బెలూచ్ ప్రస్తావన చేయాలని వ్యాఖ్యానించినట్టు పార్టీ ఉన్నత వర్గాల ద్వారా తెలిసినట్టు రాయ్ టర్స్ తెలిపింది. ఆగస్టు రెండో వారంలో ఈ సమావేశం జరుగగా, కాశ్మీర్ లో అశాంతిని కలిగిస్తున్న పాక్ కు అడ్డుకట్ట వేయాలంటే, బెలూచ్ కి మద్దతిచ్చేలా మాట్లాడటం ఒక్కటే మార్గమని ప్రధాని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. "బెలూచ్ గురించి మాట్లాడటం మంచిదే. కానీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రస్తావన సరైన సమయం అనిపించుకోదు" అని ఓ సీనియర్ మంత్రి వారించినట్టు తమకు తెలిసిందని వార్తా సంస్థ ప్రచురించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైతం ఈ ఆలోచనను వ్యతిరేకించారని, హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ పాక్ ను మౌనంగా ఉంచేందుకు ఏదైనా చేయాల్సిందేనని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారని తెలిపింది.

More Telugu News