: ఇంట్లో చెప్ప‌కుండా గోవా వెళ్లిపోయిన స్కూలు విద్యార్థుల‌ను హైద‌రాబాదుకు తీసుకొచ్చిన పోలీసులు

హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ కేంద్రీయ విద్యాల‌యంలో చ‌దువుతున్న న‌లుగురు తొమ్మిదో త‌ర‌గ‌తి బాలురు రెండు రోజుల క్రితం ఎవ‌రికీ చెప్ప‌కుండా గోవాకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ విద్యార్థుల ఆచూకీని క‌నుక్కున్న పోలీసులు ఈరోజు వారిని హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు. విద్యార్థుల వ‌ద్ద ఉన్న‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారు గోవాలోని పనాజీలో ఉన్నట్లు క‌నిపెట్టిన ఎల్బీన‌గ‌ర్ పోలీసులు పనాజీ పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో వారిని ఓ బస్టాండ్‌లో ప‌ట్టుకున్నారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న రోజే ఎల్బీనగర్‌ ఎస్సై రమేష్‌ అధ్వర్యంలో పోలీసుల టీమ్ గోవాకి వెళ్లింది. విద్యార్థుల‌ను ఈరోజు హైద‌రాబాద్ తీసుకొచ్చింది. రెండు రోజుల క్రితం త‌మ పిల్ల‌లు అదృశ్యమయ్యార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఎల్బీన‌గ‌ర్‌, ఉప్ప‌ల్ పోలీస్‌స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదు చేశారు. సాయినాథ్‌రెడ్డి, లికిత్‌కుమార్‌, విజ‌య్‌కుమార్‌, సాయికుమార్ అనే విద్యార్థుల అదృశ్యంపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు విద్యార్థుల వ‌ద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టారు. వారిలో ఓ విద్యార్థి మారుతి కారు తీసుకుపోగా, మ‌రో విద్యార్థి త‌న‌ ఇంట్లో నుంచి నాలుగు వేల రూపాయ‌లు, న‌గ‌లు తీసుకెళ్లిన‌ట్లు కూడా పోలీసులకు తెలిసింది. చివరికి వారిని ఈరోజు నగరానికి తీసుకొచ్చారు.

More Telugu News