: ఆవులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్ లో వినూత్న ప్రయోగం

రహదారులపై తిరుగుతుండే ఆవులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గాను మధ్యప్రదేశ్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. ఆవుల కొమ్ములు మెరిసే విధంగా ఉండేలా ఒక రకమైన పూతను పూశారు. ఈ పూత పూయడం ద్వారా చీకట్లో కూడా వాటి కొమ్ములు మెరుస్తూ కనపడతాయి. తద్వారా రాత్రి సమయాల్లో అవి ప్రమాదాల బారిన పడకుండా నివారించవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలగట్ జిల్లాలోని కైలాష్ చౌహాన్ అనే ట్రాఫిక్ పోలీసు ఆఫీసర్ మాట్లాడుతూ, చీకట్లో ఆవులను గుర్తించకపోవడం కారణంగా చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల్లో చాలామంది వాహనదారులు తీవ్ర గాయాలపాలు కాగా, కొన్ని సందర్భాల్లో ఆవులు కూడా మృతి చెందాయని చెప్పారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైంది, రేడియం పెయింటింగ్ ను ఆవుల కొమ్ములకు వేస్తామని, రేడియం స్టిక్కర్ల కన్నా రేడియం పూత అయితే చాలా కాలం పాటు ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా, ఆవుల యజమానులకు కూడా ఈ విధంగా చేయమని చెబుతామని సదరు అధికారి చెప్పారు.

More Telugu News