: నయీమ్ తో టీఆర్ఎస్ కీలక నేతకు లింకులు!... భువనగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు!

తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. నయీమ్ సొంత జిల్లా నల్లగొండకు చెందిన టీఆర్ఎస్ నేత, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మర్ నేతి విద్యాసాగర్ కు గ్యాంగ్ స్టర్ తో లింకులున్నాయంటూ ఏకంగా భువనగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న నయీమ్ బెదిరింపుల దందాకు సంబంధించి వెలుగు చూసిన ఆడియో టేపులో నయీమ్ నోట విద్యాసాగర్ పేరు వినపడింది. అదే సమయంలో నయీమ్ నుంచి బెదిరింపులకు గురైన భువనగిరి వ్యాపారి నాగేంద్ర నేరుగా పోలీసులకే ఈ విషయం చెప్పారు. తనను బెదిరించేందుకు నయీమ్... నేతి విద్యాసాగర్ ఫోనునే వాడుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా నయీమ్ తనను బెదిరింపులకు గురి చేసిన ఆడియో ఫుటేజీలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. దీంతో భువనగిరి పోలీసులు నేతి విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 363, 346, 386, 120(బి) సెక్షన్ల కింద నమోదైన ఈ కేసుతో టీఆర్ఎస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది.

More Telugu News