: మానవత్వం చాటుకున్న ఏపీ డీజీపీ!...గాయపడ్డ యువకుడిని సొంత కారులో ఆసుపత్రికి తీసుకెళ్లిన వైనం!

ఖాకీలంటే కఠిన హృదయమున్న వారన్న భావన ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు విషయంలో నిజం కాదు. ఎందుకంటే, నవ్యాంధ్రప్రదేశ్ కు పోలీసు బాసుగా ఉన్న ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడిని చూసి చలించిపోయారు. మొత్తం తన కాన్వాయ్ నే ఆపివేయించిన ఆయన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సదరు యువకుడిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆ యువకుడి ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ ఘటన నిన్న రాత్రి నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని బందరు రోడ్డులో నిన్న రాత్రి నడిచి వెళుతున్న యువకుడిని ఓ కారు ఢీకొట్టింది. దీంతో గాయాలతో రోడ్డుపై యువకుడు పడిపోగా, కారు డ్రైవర్ మాత్రం వాహనాన్ని ఆపకుండానే వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సాంబశివరావు... రోడ్డుపై రక్తమోడుతున్న యువకుడిని చూసి చలించిపోయారు. వెంటనే తన కారును ఆపివేయించిన ఆయన ఆ యువకుడిని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సకాలంలో అతడిని ఆసుపత్రిలో చేర్పించిన నండూరి అతడికి చికిత్స అందించి అతడి ప్రాణాలు నిలిపారు.

More Telugu News