: తెలుగు నేలపై అడుగుపెట్టిన పీవీ సింధు!... ఎదురేగి స్వాగతం పలికిన తెలుగు రాష్ట్రాలు!

రియో ఒలింపిక్స్ లో భారత్ సత్తాను చాటి దేశానికి రజత పతకం సాధించిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కొద్దిసేపటి క్రితం తెలుగు నేలపై అడుగు పెట్టింది. శంషాబాదు ఎయిర్ పోర్టులో కాసేపటి క్రితం ల్యాండైన సింధుకు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలు ఘన స్వాగతం పలికాయి. ఆమెకు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ సర్కారు నిన్న రాత్రికే హైదరాబాదులో భారీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లతో ప్రస్తుతం ఎయిర్ పోర్టు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో ఎయిర్ పోర్టు బయటకు రానున్న సింధును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం మీద రెండు రాష్ట్రాల అధికారులు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా భారీ ఊరేగింపుగా తీసుకువెళతారు. ఇదిలా ఉంటే... పీవీ సింధుకు స్వాగతం చెప్పేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కీలక మంత్రులు ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. తెలంగాణ సర్కారు నుంచి మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు తదితరులు రాగా... ఏపీ నుంచి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు వచ్చారు.

More Telugu News